-యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారి క్లీనింగ్
-దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కేసరపల్లి ఈఓ ప్రసాద్
గన్నవరం, పున్నమి ప్రతినిధి
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి హజ్ యాత్రికులు గన్నవరం అంతర్జాతీయ విమానశ్రయానికి భారీగా తరలివస్తున్న నేపథ్యంలో, విమానశ్రయ సమీప ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కేసరపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను శనివారం నిర్వహించారు.కేసరపల్లి పంచాయతీ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ప్రసాద్ పర్యవేక్షణలో జాతీయ రహదారికి ఇరువైపులా, అలాగే డివైడర్ల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను పొక్లెయిన్ యంత్రాల ద్వారా తొలగించారు. యాత్రికులకు మరియు వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించేలా, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా సిబ్బందికి ఈఓ దిశానిర్దేశం చేశారు.డివైడర్ల వద్ద పేరుకుపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నారు. విమానశ్రయానికి వచ్చే అతిథులకు మన ప్రాంతంపై మంచి అభిప్రాయం కలిగేలా పారిశుధ్య పనులు ముమ్మరం చేశామని ఈఓ ప్రసాద్ తెలిపారు. హజ్ యాత్ర ముగిసే వరకు విమానశ్రయ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుధ్య మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు.


