అక్రమ మట్టి రవాణాపై ఇబ్రహీంపట్నం పోలీసుల స్పెషల్ డ్రైవ్
అనుమతి లేకుండా మట్టి అక్రమ రవాణా – మూడు టిప్పర్లు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, జూలై 2: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఖానా ప్రాంతంలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు టిప్పర్ వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా టిప్పర్ వాహనాలతో పాటు డ్రైవర్లు, మట్టి తరలింపులో పాల్గొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వాహనాలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు లేదా ఇతర ప్రాంతాల్లో సంబంధిత శాఖల అనుమతి లేకుండా మట్టి తవ్వకం చేయడం, మట్టి రవాణా చేయడం లేదా అక్రమంగా నిల్వ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, అక్రమ మట్టి తవ్వకం మరియు రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో పదేపదే పాల్గొనే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచి అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ మట్టి తవ్వకం, రవాణా లేదా నిల్వ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





