ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా సంస్థాగత బలోపేతంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు శ్రీమతి శ్రీరామనేని మణిని బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభిస్తోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు జిల్లా కార్యదర్శిగా శ్రీరామనేని మణి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీరామనేని మణి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యత అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, మహిళల భాగస్వామ్యం పెంపు, యువతను పార్టీ వైపు ఆకర్షించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం, కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
శ్రీరామనేని మణి నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

