“రక్తపోటును సరిగ్గా కొలవండి.. నియంత్రించండి.. ఎక్కువ కాలం జీవించండి” అనే సందేశంతో నిర్వహణ
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ హైపర్టెన్షన్ లీగ్ సంయుక్తంగా ప్రకటించిన “రక్తపోటును సరిగ్గా కొలవండి.. నియంత్రించండి.. ఎక్కువ కాలం జీవించండి” అనే థీమ్తో సోమవారం ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ షేక్ అఖిల్ మాట్లాడుతూ హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది “నిశ్శబ్ద హంతకుడు”గా పరిగణించబడుతుందని తెలిపారు. చాలా మందికి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, క్రమంగా గుండె, మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిరంతరం బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.అధిక ఉప్పు, నూనె, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల రక్తపోటు సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం తీసుకోవడం, నిత్యం నడక లేదా వ్యాయామం చేయడం ద్వారా హైపర్టెన్షన్ను నియంత్రించవచ్చన్నారు.రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశముందని ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రజలకు రక్తపోటు పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. హైపర్టెన్షన్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


