ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం
ఇబ్రహీంపట్నం: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. తొర్రూర్లోని క్యాంపు కార్యాలయంలో ఆదిభట్ల సర్కిల్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీలు, నాలాల పూడికతీత పనులను వేగవంతం చేయాలని చెప్పారు.
దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు తక్షణ మరమ్మతులు చేపట్టడంతో పాటు వీధి దీపాలు పనిచేయని ప్రాంతాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ఆదిభట్ల, తుర్కయంజాల్ జోనల్ డీసీ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, టీపీవోలు, టీపీఎస్లు, పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్ వనజ, వార్డు ఆఫీసర్లు, ఏఈలు, డీఈలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




