వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఓల్డ్ బస్టాండ్, కల్వొడ్డు, ఇల్లందు క్రాస్రోడ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి విగ్రహాలను అందుబాటులో ఉంచనున్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పర్యావరణహిత మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.



