విశాఖపట్నం, పున్నమి ప్రతినిధి:
దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ దాబా వెనుక ఖాళీ ప్రదేశంలో నిషేధిత డీలక్స్ పాన్ మసాలా ప్యాకెట్లు, సంచుల్లో నింపిన రా మెటీరియల్, సీలింగ్ కవర్లు గుట్టలు గుట్టలుగా దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో ఉన్న ఈ సామగ్రిని అక్కడ ఎవరు పడేశారు? అసలు వీటిని ఏ అవసరానికి తీసుకువచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంత పెద్ద మొత్తంలో పాన్ మసాలా ప్యాకెట్లు, ప్యాకింగ్కు ఉపయోగించే సీలింగ్ కవర్లు, ఇతర రా మెటీరియల్ ఒకేచోట లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవి కల్తీ పాన్ మసాలా తయారీ కోసం తీసుకువచ్చినవా? లేక ఎక్స్పైరీ అయిన ఉత్పత్తులను ఎవరైనా ఇక్కడ అక్రమంగా పడేశారా? అన్నది అధికారులు విచారణ చేస్తేనే తేలనుంది.
మరోవైపు, రోడ్డు పక్కనే ఇలా పడేసిన ప్యాకెట్లను విషయం తెలియని వ్యక్తులు తీసుకుని వినియోగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత వీటిని తీసుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.
ఇంత భారీ మొత్తంలో నిషేధిత పాన్ మసాలా, రా మెటీరియల్ అక్కడికి ఎలా చేరింది? దీని వెనుక ఎవరున్నారు? అన్న కోణంలో సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Uploaded Video:



