పున్నమి ప్రతినిధి,తిరుచానూరు ,జూలై 29
తిరుచానూరు సిరులతల్లి శ్రీవారి దేవిరి శ్రీ పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం గజవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం అమ్మవారిని వైభవ శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేష్, సురేష్, ముని చంగల్రాయులు, ఇన్స్పెక్టర్లు చలపతి ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


