కాకినాడ, సెప్టెంబరు 16: కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సూర్యారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బీచ్ పార్క్కు ‘ఎన్టీఆర్ బీచ్ పార్క్’గా నామకరణం చేసి అధికారిక బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి పిల్లి అనంతలక్ష్మి కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె తన భర్త, టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను కలసి వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ కో-కన్వీనర్ కొమిరిశెట్టి నరసింగరావు కూడా వారితో ఉన్నారు. 2014–19 మధ్య తాను కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీచ్ ఫెస్టివల్ను వరుసగా నాలుగు సంవత్సరాలు ఘనంగా నిర్వహించినట్లు పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీచ్ ప్రాంతాన్ని రహదారి మార్గంలో, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ పరిశీలించి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.50 కోట్లతో బీచ్ పార్క్ను, రాష్ట్ర ప్రభుత్వం పుష్కర నిధులతో సుమారు రూ.12 కోట్లతో బీచ్కు అనుసంధాన రహదారి, ఫోర్లేన్ రోడ్డు, విద్యుత్ దీపాలంకరణ, గెస్ట్హౌస్ తదితర పనులను చేపట్టినట్లు వివరించారు.ఒక బీచ్ ఫెస్టివల్ సందర్భంగా అప్పటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అప్పటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో బీచ్కు ‘ఎన్టీఆర్ బీచ్’గా పేరు పెట్టాలని కోరినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని పేర్కొన్నారు.బీచ్ పార్క్ పనులు పూర్తయిన అనంతరం ‘ఎన్టీఆర్ బీచ్’ పేరుతో బోర్డు ఏర్పాటు చేయవచ్చని అప్పటి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపినప్పటికీ, అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సమక్షంలో తీసుకున్న నిర్ణయం మేరకు ‘ఎన్టీఆర్ బీచ్ పార్క్’ పేరుతో అధికారిక బోర్డు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు పిల్లి అనంతలక్ష్మి తెలిపారు.



