ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ నూకం రెడ్డి శేఖర్ రెడ్డి మరణం గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దేశ రక్షణలో భాగంగా కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన ఆయన సేవలను ప్రజలు కన్నీటి నివాళులతో స్మరించుకున్నారు.ఈ విషాద సమయంలో శుక్రవారం శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి స్వయంగా శేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీర జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని కంచి పరమేశ్వర రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమించిన శేఖర్ రెడ్డి మరణం గ్రామానికే కాకుండా దేశానికీ తీరని లోటుగా మారిందన్నారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన ఆ వీర జవాన్ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలకు సమాజం అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియల్లో సింగనపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. “భారత్ మాతా కీ జై” నినాదాల మధ్య గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అమర జవాన్కు ఘనంగా వీడ్కోలు పలికారు.


