రంగంపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా రంగంపేట మండలం నల్లమిల్లిలోని అన్నపూర్ణ గార్డెన్స్లో మహిళలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి మహిళా నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ సంక్షేమంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఆరోగ్య అంశాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు పరీక్షలు, వ్యాధి నివారణ చర్యలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని కోరారు. వ్యాక్సిన్పై ఉన్న అపోహలను తొలగించి అర్హులైన వారికి వైద్యుల సూచనల మేరకు టీకా ప్రయోజనాలను వివరించాలని సూచించారు.
యువతలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళలు కుటుంబాల్లో ఆరోగ్యం, విద్య, వ్యసనాల నివారణపై కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. నేరాలపై చట్టపరమైన చర్యలతో పాటు బాధితులకు సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని, స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరిగి కుటుంబ సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. అనపర్తి 100 పడకల ఆసుపత్రి, పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సూర్యకుమారి అధ్యక్షత వహించగా, కూటమి నాయకులు, మహిళా శక్తి ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


