పున్నమి ప్రతినిధి తిరుపతి, 2 మే2026
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.
చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ సురేష్, శ్రీ ముని చెంగల్రాయులు, శ్రీ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
———————-
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.









