వేంసూరు/ ఖమ్మం
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మర్లపాడు పార్టీ కార్యాలయం నుంచి వేంసూరు వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్కు తెలంగాణ శాసనసభ, స్పీకర్ పదవి పట్ల పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉందని, నల్ల దుస్తులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, రైతు భరోసా, యూరియా సమస్య పరిష్కారం, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్లో తులం బంగారం వంటి హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం ప్రజా సమస్యలపై వినతిపత్రాలను అధికారులకు సమర్పించారు.



