శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు @ పున్నమి మే 17
కవిగ, రచయితగ, నటుడిగ మరియు అర్థశాస్త్ర అధ్యాపకుడిగా రాణిస్తున్న డా. బద్రి పీర్ కుమార్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కళలకు సారథి మీరు మీ కలలకు వారథి మేము అనే సందేశంతో ఘనమైన సాహిత్య సేవలను అందిస్తున్న విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఉత్తమ విజేతగా నిలిచారు. అంతర్జాలం ద్వారా దృశ్యకావ్యం పేరిట దృశ్యం ఇచ్చి, దీనికి తగిన కవితలను ఆహ్వానించగా పీర్ కుమార్ స్పందించి, పయనం ప్రశ్నార్థకం? అనే శీర్షికతో పంపిన కవిత విజేతగ నిలిచి ఉత్తమ కవితగ ప్రశంసాపత్రం సాధించింది. విశ్వసాహితి కళావేదిక జాతీయ చైర్ పర్సన్ కొల్లి రమావతి నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో పీర్ కుమార్ భౌతిక పర్యావరణమా.. సామాజిక వాతావరణమా.. మా ఈ దుస్థితికి కారణం ఎవరు? మా భవిష్యత్తు గమనం ఏంటి? అంటూ మురికివాడల బాల్యం విచారిస్తున్నట్లుగా తన కవితలో వివరించారు. ఈ పోటీలో పాల్గొన్న దాదాపు మూడువందల కవితల్లో విజేతగా నిలిచిన పీర్ కుమార్ ను అభినందిస్తూ విశ్వసాహితి కళా వేదిక జాతీయ చైర్ పర్సన్ కొల్లి రమావతి, మహిళా అధ్యక్షురాలు జి.భవాని (అంజు), కన్వీనర్ మహమ్మద్ రఫీ, యువజన అధ్యక్షులు పెద్దింటి ముకుందరావు, జంధ్యాల శరత్ బాబు, శ్రీపాద సీతామహాలక్ష్మి, మిత్తింటి సుబ్రహ్మణ్యం, సమన్వయ కమిటీ బృంద సభ్యులు సత్తివాడ శ్రీకాంత్, మండల గణస్వామిలు, న్యాయనిర్ణేతల బృంద సభ్యులు తదితరులు పీర్ కుమార్ ను అభినందిస్తూ విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా పీర్ కుమార్ మరిన్ని భావాత్మక రచనలు చేసే బాధ్యతను ఈ విజయం పెంచిందని పేర్కొన్నారు.



