తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం పరిధిలోని మామిడికాయల యార్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, మామిడికాయలతో పూర్తిగా లోడైన లారీ యార్డు వద్ద నిలిపి ఉంచగా, కేఎస్ అగ్రహారానికి చెందిన మొట్టగారి ఈశ్వరయ్య (38) లారీ వెనుక టైరు సమీపంలో పడుకుని ఉన్నాడు. అనంతరం లారీని యార్డులోకి తరలించే సమయంలో డ్రైవర్ అతడిని గమనించకపోవడంతో వాహనం ముందుకు కదిలి ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్యను స్థానికులు వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మొట్టగారి సుబ్రహ్మణ్యం కుమారుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.



