మీడియాతో సమన్వయం చేసుకోవాలి – విస్తృత ప్రచారం కల్పించాలి
- సమాచార, పౌర సంబంధాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయనగరం జిల్లా బ్యూరో/రమణ, జూలై 28. ( పున్నమి )
విజయనగరం (భోగాపురం), అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమ కవరేజీ కొరకు విచ్చేసే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మరియు స్థానిక విలేకరులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
మంగళవారం విమానాశ్రయం పరిపాలన భవనంలో ప్రధానమంత్రి పర్యటన మీడియా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరయ్యే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులతో పాటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల ప్రతినిధులకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. అందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో మరియు జీవీఎంసీ పరిధిలో కౌంట్డౌన్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కౌంట్డౌన్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సందేశాలను ప్రసారం చేయాలని సూచించారు.
’గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర’గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంత అభివృద్ధి మరియు గూగుల్ డేటా సెంటర్ నిర్మాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లేలా నిర్వహిస్తున్న వివిధ రకాల పోటీల గురించి ప్రజలకు తెలియజేయాలని, విమానాశ్రయ ప్రాధాన్యతను సోషల్ మీడియాలో విసృతంగా ప్రమోట్ చేయాలని కోరారు. ప్రాంతీయంగా జరుగుతున్న అభివృద్ధిపై ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులతో పత్రికా సమావేశాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మీడియా సమన్వయ కమిటీ సభ్యులు డి.ఎస్.ఎం.కె. గోపీనాథ్, డి.ఎస్. వర్మ, వి. శ్రీరామమూర్తి, సమాచార శాఖ ఆర్.జె.డి. సదారావు, ఆర్.ఐ.ఇ. కృష్ణారెడ్డి, డి.ఐ.పి.ఆర్.ఓ.లు గోవిందరాజులు, బాలామన్ సింగ్, చెన్నకేశవరావు, డి.ఇ.ఐ.ఇ. ఇంద్రావతి తదితరులు పాల్గొన్నారు.


