బంబారాలో జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయమా..?
అండర్పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బస్ షెల్టర్ కోసం సీపీఐ అల్టిమేటం
ఆగస్టు 10లోగా చర్యలు లేకపోతే దశలవారీ ఆందోళనలు – రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ఎన్హెచ్ఏఐదే పూర్తి బాధ్యత: సీపీఐ
వాంకిడి, జూలై 16:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ రహదారి నిర్మాణం అనంతరం గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు ఆరోపించారు. గ్రామంలో అండర్పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బస్ షెల్టర్, వీధి దీపాలు, రోడ్డు భద్రతా చర్యలు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
సీపీఐ వాంకిడి మండల సహాయ కార్యదర్శి కోదురుపాక మహేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోయిరె ప్రకాష్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, గ్రామ మధ్యలో జాతీయ రహదారి ఉండటంతో ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు దాటాల్సి వస్తోందన్నారు. నిర్మాణ సమయంలోనే అండర్పాస్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు.
రహదారి ప్రారంభమైన నాలుగేళ్లలో పదికి పైగా, దాదాపు 20 వరకు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, వాటిలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ఇప్పటికీ బస్ షెల్టర్ లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు ఎండ, వర్షంలోనే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అలాగే తగిన వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాల భయం మరింత పెరిగిందని తెలిపారు.
ఈ సమస్యలపై పలుమార్లు జిల్లా, మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆగస్టు 10లోగా అండర్పాస్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బస్ షెల్టర్, రోడ్డు భద్రతా చర్యలు, వీధి దీపాల ఏర్పాటుపై చర్యలు తీసుకోకపోతే గ్రామ ప్రజలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆందోళనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేదా ప్రజలకు నష్టం జరిగినా అందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ఎన్హెచ్ఏఐ అధికారులదే పూర్తి బాధ్యత అని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు.


