ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం కాబట్టే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల సంక్షేమంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తు, సర్వతోముఖ అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తూ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమం అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అందించడం మాత్రమే కాదని, ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడే స్థాయిలోనే కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేలా ప్రజా ప్రభుత్వం బలమైన పునాదులు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.



