పుష్పగిరిలో ఘనంగా వ్యాస పౌర్ణమి – గురుపౌర్ణిమ గిరిప్రదక్షిణ
కడప, పున్నమి ప్రతినిధి:
వ్యాస పౌర్ణమి, గురుపౌర్ణిమ సందర్భంగా పుష్పగిరి మహాక్షేత్రంలో నిర్వహించే 41వ గిరిప్రదక్షిణ కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని న్యాయవాది, శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సట్టి భారవి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ కాంట్రాక్టర్ పిచ్చిరెడ్డి గారు, వారి సతీమణి, కుమార్తె, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. పసుపులేటి శంకర్ గారు, టెంపుల్ ప్రేయర్ సొసైటీ అధ్యక్షులు కాల్వ సోమ కళానాథరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా పాదరాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పుష్పగిరి క్షేత్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సంతాన మల్లీశ్వర స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి శంకర్ మాట్లాడుతూ, వ్యాస మహర్షి అందించిన చతుర్వేద జ్ఞాన సంపదను నేడు ప్రపంచం తెలుసుకుంటోందని అన్నారు. మనమందరం ఋషి పరంపర వారసులమని పేర్కొంటూ, వ్యాస మహర్షి అనుగ్రహంతో పాటు శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ వైద్యనాధీశ్వర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి నిర్వాహకులు సట్టి భారవి, సునీల్ శ్రీనివాసమూర్తి, కొమ్మలూరి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, అజయ్, శ్రీనివాసులు, భాస్కర్, వరప్రసాద్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

