ఆత్మకూరు, జూలై 25: ( పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చే దిశగా మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ శనివారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తూ వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రపరిచే పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పరిశుభ్రత పనులు నిరంతరం నాణ్యతతో కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని కమిషనర్ గంగాప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆత్మకూరును నిర్మించగలమని ఆయన తెలిపారు.

