పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగం
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
పున్నమి న్యూస్
02 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
• ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం
• నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం
• హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ
• పొత్తులతో వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది
• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు
• రాష్ట్ర విభజన సగౌరవంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నదే మా ఆవేదన
• ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఇంకెత కాలం ద్వేషం రగిలిస్తారు?
• కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పై చేసిన కామెంట్స్ కు సమాధానం చెబితే తప్పా..?
• ప్రాంతీయ విద్వేషాల వల్ల జాతీయ సమగ్రత దెబ్బతింటుంది
• రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే రహదారికి శ్రీ బూర్గుల రామకృష్ణరావు పేరు
• చెరువు కబ్జా అని తేలితే స్వచ్ఛందంగా అప్పగిస్తాను
• గద్దర్ గారి విగ్రహం ఏపీలోనూ ఏర్పాటు చేస్తాం
• హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘జనసేన పార్టీ తెలంగాణ నాయకులు చాలాసార్లు తెలంగాణలో పార్టీని విస్తరించాలని అడిగారు. అయితే తెలంగాణ ప్రజలకు అవసరం వచ్చినపుడు, ఇక్కడి ప్రజలు కోరుకున్నపుడు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పాను. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు, దేశ సమగ్రతను దెబ్బతీసే కుయుక్తులు చూస్తుంటే కచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉండాలి. ఇప్పుడు చెబుతున్నాను.. తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది. ఇక నుంచి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా పోరాడుతుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వయంగా తెలంగాణ కదనరంగంలోకి తానే దిగుతానని, ప్రజల మధ్య తిరుగుతాని అన్నారు. ప్రజల సమస్యల మీద, ఆకాంక్షల సాధనకు జనసేన పార్టీ బలమైన పోరాటం చేస్తుందని, వచ్చే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తుందని చెప్పారు. ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం అన్నారు. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లో జనసేన తరఫున నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సమావేశం సాధక్ ల సమ్మేళనానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సమావేశం గురించి తెలిసి భారీ సంఖ్యలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు శ్రీ పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పొత్తులతో ముందుకు వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇక సహనానికి చరమగీతం పాడి ఎత్తులకు పైఎత్తులు వేస్తాము. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా చేసిన పోరాటాలను గౌరవించి, తెలంగాణ యువత సమష్టి స్ఫూర్తికి ప్రణమిల్లి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి పాలకులు ఇవ్వలేదు. పార్లమెంటు తలుపులు మూసి, సభ్యులను బయటకు నెట్టి తెలంగాణను ప్రకటించడాన్ని మాత్రమే జనసేన పార్టీ తప్పు పట్టింది. సుమారు 1200 మంది బలిదానాలకు ఇవ్వాల్సిన మర్యాద అదా..? ఇలా ప్రకటించడం కోసమా..? సగటు తెలంగాణ పోరాటయోధులు ఇన్నేళ్లు కష్టపడ్డారనే ఆవేదనతోనే నేను 11 రోజులు అన్నం మానేశాను. అంతే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏనాడూ జనసేన పార్టీ కానీ, నేను కానీ వ్యతిరేకం కాదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సముచిత గౌరవం ఇవ్వకుండా విభజించిన తీరునే ప్రస్తావించాను.
• ప్రతిసారీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు
తెలంగాణ, ఆంధ్ర ప్రజల ప్రజల మధ్య ప్రతిసారీ విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నపుడు ఈ నాయకులు నోళ్లు ఎందుకు మూతపడ్డాయి. నాయకులు తప్పు చేస్తే నాయకులను అనాలి కానీ, ప్రతిసారి ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామనే రాజకీయాలు పోవాలి. రాష్ట్రం విడిపోయి పుష్కరకాలం అవుతున్నా, ఉద్యోగాలు రాకపోవడానికి, పరిశ్రమలు లేకపోవడానికి ఆంధ్రోళ్లు కారణం అనడం సబబు కాదు.
• ఇప్పుడు మాట్లాడే నాయకులు ఆదిలాబాద్ అడవుల్లో తిరిగారా?
తెలంగాణ మీద ప్రత్యేకంగా నేను ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గడ్డమీదనే జనసేన పార్టీ పుట్టింది. తెలంగాణ సమాజ ఆవేదన నుంచి జన్మించినవే పార్టీ ఏడు సిద్ధాంతాలు. 2007లోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగాను. ఆదిలాబాద్ తండాల్లో తిరిగి అక్కడి వారికి బోరు వేయించి మరీ నీరు అందించాను. ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎవరైనా ఆదిలాబాద్ అడవుల్లో, గోండుల తండాల్లో తిరిగారా? 2024 ఎన్నికల్లో వారాహి యాత్రను సైతం తెలంగాణ కొండగట్టు నుంచి ప్రారంభించాను. నన్ను ఆంధ్ర సరిహద్దుల్లో వైసీపీ ప్రభుత్వం ఆపేస్తే నాతో పాటు నిలబడింది తెలంగాణ యువతే.
• తెలంగాణ మీ అయ్య జాగీరా..?
ప్రతిసారీ పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రానివ్వం. తెలంగాణలో తిరగనివ్వం అంటుంటారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా..? బి.ఆర్.ఎస్. ఆఫీసు గుంటూరులో పెట్టుకున్నారు. జనసేన నుంచి వెళ్ళిపోయిన నాయకుడిని అక్కడ అధ్యక్షుడు గా చేశారు. బి.ఆర్.ఎస్. అధినేత మహారాష్ట్ర, పంజాబ్ ల్లో పర్యటించవచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడడా?
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలి. ఇక్కడి ప్రజానీకం సంతోషంగా ఉండాలి. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. తెలంగాణ నాయకులు వేరు, ప్రజలు వేరు. అలాగే ఆంధ్ర నాయకులు వేరు, ప్రజలు వేరు. తప్పు చేసిన నాయకులను నిలదీద్దాం. నేను తప్పు చేసినా నన్ను నిలదీయండి. అంతేకాని తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య దూరం పెంచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాత్రం మాట్లాడకండి. అది ఎవరికీ మంచిది కాదు. నేను నా ఇంటి ముందు నుంచే సమావేశంలో మాట్లాడుతున్నాను. నాకు భయం లేదు. నాపై దాడి చేయాలనుకునేవారెవరైనా రావొచ్చు. బాంచన్ మీ కాల్మొక్తా అనే వాడిని కాదు.. ధైర్యంగా నిలబడతాం. నేను గత 12 ఏళ్లలో తెలంగాణలో ఏ నాయకుడిని అనలేదు. కానీ నన్ను పదేపదే ఆంధ్ర కొడకా అని తిట్టినా.. నా పోరాటాల గడ్డ తెలంగాణ నా గుండెల్లోనే ఉంటుంది. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు, వ్యాపారులు బాగున్నారు. ఆంధ్రలో తెలంగాణ కాంట్రాక్టర్లు, వ్యాపారులు బాగానే ఉన్నారు. కానీ ప్రజల్లోనే కావాలని దూరం పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వాడు తెలంగాణ రాకూడదు అని తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేస్తే, అప్పుడు నేనేంటో చూపిస్తా.
• అమిత్ షా గారిని అంటే నేను సమాధానం చెప్పొద్దా..?
ఓ విశ్లేషకుడు ఇష్టానుసారం మాట్లాడి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తో మేము అనని మాటలను అంటే దాన్ని ఖండించాం. అమిత్ షా పై కామెంట్స్ చేస్తే సమాధానం చెప్పకూడదా? దానికి ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే మాటలకు ఎక్కడ పొంతన ఉంది. నేను మాట్లాడిన తర్వాత మళ్లీ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి నానా హంగామా చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను తిట్టకుండా, ప్రజల మధ్య ద్వేషం నింపి ఏం సాధిస్తారు..? తెలుగు మాట్లాడే ప్రజలు షోలాపూర్, నాందేడ్, సూరత్ ఇలా దేశంలో చాలాచోట్ల ఉన్నారు. అక్కడి స్థానికులు కూడా ఇలా చేస్తే జాతీయ సమగ్రత దెబ్బతింటుందని గుర్తు ఉంచుకోండి. కేంద్ర హోం మంత్రి వద్ద అనని విషయాన్ని, జరగని విషయాన్ని కూడా విశ్లేషకులు చెప్పారని, దాన్ని తప్పు అని చెప్పకూడదు అంటే ఎలా..? మీరు ఏం చేసినా మేం బాంచన్ దొర అనాలని మీరు భావిస్తే, బెదిరిస్తే మేం భయపడే వాళ్లం కాదు.
• కబ్జా అని తేలితే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తా
చెరువు కబ్జా అంటూ కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. కోడి చెరువు కబ్జా చేశానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. నేను సవాల్ చేసి చెబుతున్నా…. తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం సర్వే చేయించి, తప్పు జరిగి ఉంటే కనుక స్వచ్ఛందంగా ఆ భూమిని నేను అప్పగిస్తాను. అక్కడ నాకు గోశాల మాత్రమే ఉంది. సుమారు 50 నుంచి 60 ఆవులు ఉంటాయి. మేత కోసం గడ్డి కోస్తారు. దశాబ్దాల క్రితం తీసుకున్న భూమి. అక్కడ ఎలాంటి తప్పు జరిగినట్లు ప్రభుత్వం తేల్చినా ఆ భూమిని తీసుకోవచ్చు. నాకు అభ్యంతరం లేదు. కొందరు సూడో మేధావులు, పార్టీల పేరుతో, సోషల్ మీడియా ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలి. ఆ భూమిలోకి వెళ్ళి రాద్ధాంతం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తిలోకి ఇష్టారీతిన వెళ్ళడం చట్టరీత్యా నేరం.
• కమ్యూనిజం అందుకే అంత్యదశకు వచ్చింది
ప్రపంచ కార్మికులారా ఏకం కండీ అని ఒకప్పుడు పిలుపునిచ్చిన వామపక్షాలు నేడు ప్రాంతీయతను రెచ్చగొట్టే స్థితికి చేరకుంటున్నాయి. వామపక్ష భావజాలం, వామపక్ష సానుభూతిపరుల ముసుగులో కొందరు చేస్తున్న వ్యక్తిగత ప్రాంతీయత సిద్దాంతాల వల్లనే కమ్యూనిజం దేశంలో అంత్య దశకు వచ్చింది. గద్దర్ బతికి ఉన్నపుడు కనీసం ఆయనను పట్టించుకోని వామపక్ష మేధావులు ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నతో నేను రాజకీయాలకు రాకముందు నుంచే పరిచయం ఉంది. నా ఖుషీ సినిమాలోని పాటలో పెట్టిన థీమ్ తాకట్టులో భారతదేశం స్ఫూర్తిని చూపిందని గద్దర్ అన్న మాటలు నాకింకా గుర్తే. ఆయన వెన్నులో బుల్లెట్లు దిగినప్పుడు ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ ఉన్నారు? నేటి వరకూ చెప్పలేదు – ఓ రోజు గద్దరన్న వచ్చి.. తమ్మి వెన్నులో ఇబ్బంది ఉంది… తిరగడం కష్టం అవుతోంది బండి తీసి ఇయ్యి అన్నారు. రెండు రోజుల్లో కారు పంపించాను.
తెలంగాణ మీద ప్రేమ లేకుంటే టీటీడీ నుంచి రూ.30 కోట్లు కొండగట్టు ఆలయ అభివృద్ధికి తీసుకొస్తానా..? విపత్తుల వేళ రూ.కోటి విరాళం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తానా..? మీరే చెప్పాలి. తెలంగాణలోని భీం రావు వాడ కోసం కొట్లాడినప్పుడే నా మీద మొదటి పోలీసు కేసు అయింది. జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటాలను, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటే పార్టీ. ఎలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడదు.
• మీరు మాత్రం అన్ని రాష్ట్రాల్లో తిరగొచ్చా.. పోటీలు చేయొచ్చా?
పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకూడదు అని చెప్పే నాయకులు ఏ రాష్ట్రంలో అయినా తిరగొచ్చు. పార్టీలను విస్తరించొచ్చు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయి ఆంధ్రలో పోటీ చేస్తామంటే మేం స్వాగతించాం. వారు పంజాబ్, మహారాష్ట్ర ఎక్కడైనా పార్టీని విస్తరించొచ్చు. మేం మాత్రం రాకూడదంటే ఎలా..? తెలంగాణ యువత శివ, మల్లికార్జున వంటి వారు చేసిన పోరాట ఫలితంగా యురేనియం తవ్వకాలు ఆగాయి. తెలంగాణ యువత లోపలున్న భావజాలం పదిమందిని కదిలిస్తుంది. వారి పోరాట స్ఫూర్తి కచ్చితంగా అందరికీ దశను చూపిస్తుంది. జనసేన పార్టీ ఈ రోజు 2 వేల మందితో సభ నిర్వహించాలని భావిస్తే అడ్డుకున్నారు. జనసేన పార్టీ బలమైన క్యాడర్ లేకున్నా, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందనే భయమే దీనికి కారణం. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ దక్షిణాది వాయనాడ్ లో పోటి చేయొచ్చు. ఇంధీరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయొచ్చు. మేం మాత్రం పక్క రాష్ట్రం నుంచి రాకూడదా..? అలా అయితే కాంగ్రెస్ ను ఉత్తరాది పార్టీగానే పరిగణించాలి కదా? ఓ జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రాంతీయత గురించి మాట్లాడుతుంటే ఏం అనిపించడం లేదా..? తెలంగాణ విభజనను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం లాంటి పార్టీలను మాత్రం ఏమీ అనలేని పరిస్థితి ఉంది. తెలంగాణ గురించి జనసేన పార్టీ ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు.
• ప్రాంతీయ విద్వేషాలు ఉగ్రవాదం కంటే ప్రమాదం
ఇది నా దేశం. నేను ఎక్కడికైనా వస్తా. ప్రతి రాష్ట్రానికి వెళ్లినపుడు పాస్ పోర్టులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నాయకులు ప్రజల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు పెంచకండి. అది మంచిది కాదు. నిరుద్యోగిత రేటు ఆంధ్రలో 4.2 ఉంటే, తెలంగాణలో 5.0కు పెరిగింది. ఇలాంటి ప్రజలకు, యువతకు పనికొచ్చే విషయాల పట్ల మేధావులు రాజకీయ నాయకులు దృష్టి పెడితే మంచిది. ఐ లవ్ పాకిస్థాన్ అన్న నాయకులు మీకు ముద్దు అవుతున్నారు తప్పితే.. తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షల గురించి నిత్యం ఆలోచించే నాలాంటి వారు శత్రువులుగా చూస్తున్నారు. ఇది ప్రమాదకరం. దేశ సుస్థిరతను, సమగ్రతను దెబ్బతీసేలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. జనసేన పార్టీ ప్రాంతీయ వాదాన్ని గౌరవిస్తుంది… అలాగే జాతీయ వాదానికి తగిన ప్రాధాన్యం ఇస్తుంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం సహించేది లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ , రేవంత్ రెడ్డి ప్రమేయం ఉంది అనను కానీ, కొందరు వ్యక్తులు పార్టీలు, సోషల్ మీడియా ముసుగు వేసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
• కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ప్రాంతీయ వాదం పేరిట ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న కొన్ని శక్తుల పట్ల కేంద్రం దృష్టి పెట్టాలి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారు ఉండకూడదు… తెలంగాణలో మర్వాడీలు ఉండకూడదు అంటూ చెబుతున్న వారి వెనుకున్న శక్తులపై దృష్టి పెట్టాలి. అమిత్ షాని కూడా బెంగాల్ రానివ్వం అన్నారు. రానివ్వం అన్న వారే నేడు కనుమరుగు అయ్యారు. దేశాన్ని విచ్ఛన్నం చేయాలని, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే వారిని వదిలేయకూడదు. వీరిని ఇలాగే వదిలేస్తే జనగణమన, వందేమాతరం కూడా పాడేది లేదని చెబుతారు. అప్పుడు దేశ సమగ్రత, జాతీయవాదానికి కూడా విఘాతం కలుగుతాయి. కావాలని విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని నియంత్రించేలా చొరవ తీసుకోవాలి.
తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రధాన కారణం అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు పేరును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను కలిపే రహదారికి పెట్టాలనేది నా ఆకాంక్ష. ఏపీలోనూ గద్దర్ స్ఫూర్తిని తీసుకుంటాను. అక్కడ గద్దర్ విగ్రహం పెడతాం. తెలంగాణలో జనసేన సాధన మొదలుపెట్టే దశకు వెళ్తున్నాం. ప్రజలను మభ్యపెట్టం… మాయ చేయం. ప్రజా సమస్యల మీద ఉన్నది ఉన్నట్లుగా పోరాడుతాం. ప్రజల మధ్దతును చూరగొంటాం’’ అన్నారు.



