శ్రీ సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ.
22న ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాల ప్రారంభం 31 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.
భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు
కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనున్నాయి.
జూలై 21న సాయంత్రం 6 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు.
జూలై 22న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.
ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాలంకరణలు, రంగవల్లులతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రతిరోజూ దివ్య వాహనసేవల్లో స్వామివారి దర్శన భాగ్యం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారు వివిధ దివ్య వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళదర్శనం ప్రసాదించనున్నారు.
జూలై 28న ఆర్జిత కల్యాణోత్సవం
జూలై 28న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు.
పాల్గొనే ప్రతి దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలను టీటీడీ బహుమతిగా అందజేస్తుంది.
ప్రతిరోజూ భక్తి సంగీతం – హరికథలు – సంకీర్తనల సందడి
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్,అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూభక్తిసంగీతం,హరికథలు,సంకీర్తనలు,ఆధ్యాత్మిక,సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.




