నెలరోజులుగా వీధిలైట్లు లేక గ్రామస్తుల తీవ్ర ఇబ్బందులు
మేడిపల్లి నక్కర్త గ్రామంలో అంధకారం – పట్టించుకోని ప్రజాప్రతినిధులు
పున్నమి న్యూస్
10 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో గత నెలరోజులుగా వీధిలైట్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు రాత్రివేళల్లో పూర్తిగా చీకటిమయంగా మారడంతో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు.
వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో గ్రామంలో సంచరించడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాములు, కుక్కల భయం పెరిగిందని, చిన్నపిల్లలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
ఈ సమస్యపై పలుమార్లు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామ సమస్యలపై స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రజల భద్రతకు సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామంలో చెడిపోయిన వీధిలైట్లను మరమ్మతులు చేసి తిరిగి వెలిగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




