*ఎండలు కాస్తున్నా రెక్కలు విప్పుతున్న గ్రీనరీ
*కార్పొరేషన్ హార్టికల్చర్ కృషికి కనిపిస్తున్న ఫలితం
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం చేస్తున్న కృషితో నగరంలోని అనేక ప్రాంతాల్లో పచ్చదనం పరుచుకుంటూ కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ హార్టికల్చర్ ఏడీగా నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరంలో హార్టికల్చర్ విభాగం పనితీరు క్రమేపీ మెరుగవుతోంది.
గతంలో సరైన శ్రద్ధ చూపకపోవడంతో పచ్చదనం అంతంత మాత్రంగానే ఉండేది. అయితే నరసింహారావు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. వేసవి కాలమైనప్పటికీ మొక్కలకు సమృద్ధిగా నీరు అందిస్తుండటంతో అవి చిగురులు తొడిగి పచ్చదనం వైపు పరుగులు తీస్తున్నాయి.
నగరంలోని సుమారు 45 పార్కులను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుండగా, అందుకు కార్పొరేషన్ ఉద్యానవన శాఖ తన వంతు బాధ్యతగా కృషి చేస్తోంది. దీంతో పలు పార్కులు అందమైన నందనవనాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
అలాగే నగరంలోని డివైడర్లు, ఐలాండ్ల మధ్య కూడా రోజురోజుకూ పచ్చదనం పెరుగుతోంది. వివిధ రకాల రంగురంగుల పూల మొక్కలతో డివైడర్లు, ఐలాండ్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.
గతంలో డివైడర్లలోని మొక్కలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించేవారు. అయితే నరసింహారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. దీంతో మొక్కలకు నిరంతరంగా, సమృద్ధిగా నీరు అందుతోంది.
మండే వేసవి ఎండలను సైతం తట్టుకుని మొక్కలు ఏపుగా, పచ్చగా పెరుగుతున్నాయి. డివైడర్ల మధ్య ఎండిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలను నాటడం, ప్రత్యేక కార్మికులతో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి మెరుగైన పద్ధతులను ఉద్యానవన శాఖ అమలు చేస్తోంది.
ఈ చర్యలతో నెల్లూరు నగరంలో పచ్చదనం “మూడు పువ్వులు–ఆరు ఆకులు” అన్న చందంగా విస్తరిస్తోంది. నగర సుందరీకరణకు తనవంతు పాత్ర పోషిస్తున్న కార్పొరేషన్ ఉద్యానవన శాఖ పనితీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.



