గురుకుల బాలికలకు ‘శక్తి టీం’ అవగాహన సదస్సులో సీఐ గంగాధర్ సూచనలు
ఆత్మకూరు, జూలై 17 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
విద్యార్థినులు చెడు అలవాట్లు, అనుచిత పరిచయాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఆత్మకూరు సీఐ జి. గంగాధర్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శక్తి టీం సభ్యురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ గంగాధర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో బాలికలు అపరిచిత వ్యక్తులతో పాటు సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.విద్యార్థి దశలో చదువుపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యే మహిళలకు నిజమైన శక్తి అని, విద్యావంతులైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో స్వయంగా నిలబడగలరని అన్నారు.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను చదువుకోడానికి దూర ప్రాంతాలకు పంపిస్తున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టేలా మంచి నడవడికతో చదువులో రాణించాలని విద్యార్థినులకు సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సై జంపానీ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ రూత్, ఉపాధ్యాయులు, శక్తి టీం సభ్యులు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.


