తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పౌర్ణమి ప్రతినిధి ) రాజమండ్రి :
రాజమహేంద్రవరం: వినాయక చవితి ఉత్సవాలను విద్యుత్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈ తిలక్ కుమార్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి గుర్తింపు పొందిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఎస్ఈ తెలిపారు. ఈ సదుపాయాన్ని మండపాల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉచిత విద్యుత్ సరఫరా పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకువిద్యుత్ను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత నిబంధనల ప్రకారం గణేష్ మండపాలకు విద్యుత్ కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మండపాల్లో విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసే సమయంలో నాణ్యమైన సామగ్రిని వినియోగించాలని అధికారులు సూచించారు. విద్యుత్ తీగలు ఎక్కడా బహిర్గతంగా ఉండకుండా, నీటికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఈ తిలక్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.


