తిరుపతి కలెక్టరేట్, సెప్టెంబర్ 7 పున్నమి ప్రతినిధి
పుత్తూరు మండలం, తడుకు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 182/1పిలో ప్రతిపాదించిన క్వారీ, మైనింగ్ కార్యకలాపాలను రద్దు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ఎమ్మార్పీఎస్ నగరి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ., సుమారు 12.966 హెక్టార్ల గాయచరు భూమిని దశాబ్దాలుగా పరిసర గ్రామాల పశువుల మేతకు వినియోగిస్తున్నారని తెలిపారు. గతంలో క్వారీ తవ్వకాలు, బ్లాస్టింగ్ కారణంగా భూగర్భ జలాలు, తాగునీటి బావులు, వ్యవసాయ బోర్లు దెబ్బతిన్నాయని, మైనింగ్ ధూళితో పంటలు నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు, దేవాలయాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో మరికొంత భూమిని క్వారీకి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దండోరా వేయించారని తెలిపారు. టి.ఆర్. కండ్రిగ కాలనీ, టి.ఆర్. కండ్రిగ ఎస్టీ కాలనీ, సదాశివ ఎస్టీ కాలనీ, జగనన్న కాలనీ, వీఎస్ఎస్పురం గ్రామాల ప్రజల జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గాయచరు భూమిని యథాతథంగా సంరక్షించాలని కోరారు. సెప్టెంబర్ 7న తడుకులో నిర్వహించనున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేసి, క్వారీ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


