కడప ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నిక
కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ కడప నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాల సుమంత్, జిల్లా కార్యదర్శి వీరపోగు రవి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం.77ను రద్దు చేసి, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
డిగ్రీ హానర్స్ విధానం విద్యార్థుల కోర్సు ఎంపిక హక్కులను హరించడమే కాకుండా పరీక్షల నిర్వహణలో గందరగోళానికి దారితీస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య పేరుతో విద్యార్థుల నుంచి వేలాది, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. సొంత భవనాలు ఉన్న కొన్ని హాస్టళ్లలో కూడా కనీస మౌలిక సదుపాయాలు లేవని, ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితులు కొనసాగితే విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా దేశంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై స్పందిస్తూ, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
అనంతరం కడప నగర నూతన కమిటీని ప్రకటించారు. నగర అధ్యక్షుడిగా నవీన్, కార్యదర్శిగా అఖిలేష్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా మనోహర్, హరి, ఓంకార్, నాని, సహాయ కార్యదర్శులుగా కార్తీక్, నరేంద్ర, సిద్ధు, కే. కార్తీక్ ఎన్నికయ్యారు. నగర కమిటీ సభ్యులుగా ఆనంద్, చందన్ కుమార్, వెంకటేష్, విష్ణు, మల్లికార్జున, విక్రమ్, అవిలాస్లను ఎంపిక చేశారు. మొత్తం 17 మంది సభ్యులతో నూతన నగర కమిటీ ఏర్పాటైనట్లు నాయకులు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షుడు నవీన్, కార్యదర్శి అఖిలేష్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు.



