నందలూరు: అరవపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణం చేపట్టకుండా, ఇప్పటికే ఖాళీగా ఉన్న పక్కా భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, పత్రికా రిపోర్టర్ డాక్టర్ వి. డేవిడ్ కళ్యాణ్ రాజ్ అధికారులను కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్ భవనాల్లో భాగంగా అరవపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే పాఠశాల ప్రాంగణం, క్రీడా మైదానం చాలా చిన్నదిగా ఉండటంతో విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మైదానంలో స్మార్ట్ కిచెన్ భవనం నిర్మిస్తే విద్యార్థులు క్రీడలు ఆడేందుకు మరింత స్థలం తగ్గిపోతుందని, వారి క్రీడా కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఇప్పటికే నిర్మించి ఉన్న పక్కా భవనం ఖాళీగా ఉందని, ఆ భవనానికి కాంపౌండ్, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ భవనానికి అవసరమైన స్వల్ప మార్పులు చేసి స్మార్ట్ కిచెన్గా వినియోగిస్తే ప్రభుత్వానికి అదనపు నిర్మాణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు, క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల మైదానాన్ని కాపాడాలని, ఖాళీగా ఉన్న పక్కా భవనాన్నే స్మార్ట్ కిచెన్ కోసం వినియోగించేలా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డాక్టర్ వి. డేవిడ్ కళ్యాణ్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

