కుల, మతాలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి : మారం కృష్ణ ప్రసాద్
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 26: కులాలు, మతాల పేరుతో వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరమని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. వ్యాపారవేత్త మరియు ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు టీజీ వెంకటేష్పై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గతంలో కుల వృత్తుల ఆధారంగా పనులు జరిగేవని, ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని తెలిపారు. కుల, మతాల పేరుతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సమాజంలో విభేదాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా వేదికల్లో మాట్లాడే వారు సంయమనంతో వ్యవహరించాలని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను నివారించాలని సూచించారు. రాజకీయాలు, పార్టీలు మారుతూ ఉంటాయని, అయితే సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం కొనసాగాలని అన్నారు.
దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుంటారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వర్గాలపై కుల ప్రస్తావనతో విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా కుల, మతాల ధూషణలను ఐవిఎఫ్ మరియు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఖండించారు. కార్యక్రమంలో గోకవరపు జితేంద్ర రవి, ఐవిఎఫ్ ఈసీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

