ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): మురగళ్ల గ్రామానికి చెందిన యువకుడు తోడేటి రాజేష్ మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రక్తదానం చేసిన ఆయన, ఆపదలో ఉన్న వారికి తన రక్తం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ, అత్యవసర సమయంలో ఎవరికైనా తన రక్తం ఉపయోగపడాలనే మంచి సంకల్పంతో సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
యువతలో రక్తదానంపై అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానంలో భాగస్వాములు కావాలని రాజేష్ పిలుపునిచ్చారు. ఆయన చేసిన సేవను పలువురు అభినందించారు.

