ముస్తాబైన మధిర ట్యాంక్ బండ్.. గణనాథుని నిమజ్జనానికి సర్వం సిద్ధం
మధిర/ ఖమ్మం వినాయక చవితి నవరాత్రి వేడుకల ముగింపు ఘట్టమైన గణనాథుని నిమజ్జన మహోత్సవానికి మధిర ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత తెలిపారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను టౌన్ సీఐ డి. రమేష్, మున్సిపల్ కమిషనర్ కె. సామ్యూల్ పాల్, వార్డు కౌన్సిలర్ బోడేపూడి రేవతితో కలిసి ఆమె పరిశీలించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుజాత వెల్లడించారు. రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ, విగ్రహాల నిమజ్జనం కోసం భారీ క్రేన్లు, పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు సంయమనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని సుజాత విజ్ఞప్తి చేశారు.


