Thursday, 7 May 2026

Tag: Congress Party

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ఇంధన భద్రతపై మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారతదేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ తరఫున హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ.. రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల విస్తరణలో హైదరాబాద్ నగరమే కాకుండా, ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. బీజీఎల్‌లో మరిన్ని సీజీఎన్జీ స్టేషన్లు, పెట్టుబడులు, సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పెంచాలనీ, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచాలనీ, తద్వారా తెలంగాణలో పట్టణ, సెమీ-అర్బన్ పైప్డ్ గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణకు వీలు కల్పించాలని శ్రీధర్ బాబు కేంద్రాన్ని కోరారు. ఎల్ఎన్జీ, సీఎన్జీ టెర్మినల్స్‌కు నిధులు, పెరుగుతున్న పారిశ్రామిక, దేశీయ అవసరాలను తీర్చడానికి తెలంగాణలో సీఎన్జీ, ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహ నిధుల వినియోగాన్ని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణ వ్యవసాయ వ్యర్థాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, తెలంగాణలో గణనీయమైన వ్యవసాయ వ్యర్థాల ఉత్పత్తిని ఉదహరిస్తూ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం వీటిలో పెట్టుబడి పెట్టాలని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. సీబీజీ, వ్యర్థాల నుంచి శక్తి సాంకేతికతలు, వ్యవసాయ సంపన్న ప్రాంతాలలో కొత్త సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సాటాట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాల కింద క్లీన్ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించడానికి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ పైప్‌లైన్ సినర్జీ, తూర్పు, పశ్చిమ గ్యాస్ పైప్‌లైన్ వెంబడి తెలంగాణ వ్యూహాత్మక స్థానాన్ని మంత్రి శ్రీధర్ బాబు హైలైట్ చేశారు. తక్కువ ఖర్చుతో గ్యాస్ ఆధారిత ఇంధన పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కేంద్రం నేతృత్వంలోని మరిన్ని పెట్టుబడులను ప్రతిపాదించారు. ఇంధన భద్రతపై దృష్టి, ఇంధన రంగంలో దేశంలో కీలక భాగస్వామిగా తెలంగాణ స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి జాతీయ నమూనాగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ప్రోయాక్టివ్ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సంసిద్ధతతో, భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..

*తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..* *రీజినల్ రింగ్ రైలు అనుమతుల కోసం విజ్ఞప్తి..* న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రైల్ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ. – రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ. – రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కి.మీ. – రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ. – రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో రైల్వే అనుసంధానతను పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు, దీనికి రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, గ్రామీణ పేదరికం తగ్గి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేయతలపెట్టిన హైటెక్ ఎలక్ట్రానిక్ పార్కుకు సంబంధించి EMC 2.0 పథకం కింద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక నూతన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా.. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు తక్షణ ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులు, పలు దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు ఇది అవసరమన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, జులై 14, పున్నమి ప్రతినిధి: మహిళా శ్వశక్తి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని నియోజకవర్గ పరిదిలోని కాటారం, మహాదేవ పూర్, మహా ముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బాంక్ లింకేజీ, ప్రమాద భీమా, రుణ భీమా, మహిళా సంఘాలు ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా దాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. 36,34,751 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా 30 లక్షలు, బ్యాంకు లింకేజీ 10.30 కోట్లు, 69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాలలో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు.మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏమి ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాబ్యాసం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో మహిళలలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపార వేత్తలుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తి కి వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి విద్యుత్ విక్రంయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారం రోజుల్లో మండలానికి 100 మంది మహిళలకు కుట్టు మిషన్లులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 200 లోపు ఉచిత విద్యుత్తు, 500లకు గ్యాస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా ఇందిరామహిళా శక్తి క్యాన్టీన్లు, వడ్డీలే ని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టించే పనులు, గణపురం, మహాదేవ పూర్ లో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఆర్థికాభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీము వర్కుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున 30 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, 5 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.