ఖాజీపేట హాస్టల్ సమస్యల నిలయం
ఖాజీపేట సమీకృత సంక్షేమ వసతి గృహంలో కనీస వసతులు కరువు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐవైఎఫ్ కడప ప్రతినిధి ఆగష్టు 13 ఖాజిపేటలోని సమీకృత సంక్షేమ వసతి గృహ సముదాయంలో విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు బుడ్డొల్ల శ్రీకాంత్ తెలిపారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమీకృత సంక్షేమ వసతి గృహంలోని బాత్రూమ్ల పరిస్థితి దారుణంగా ఉందని, పలు బాత్రూమ్లకు తలుపులు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ పేర్కొన్నారు. బాత్రూమ్లకు వెళ్లేందుకు కంపచెట్లు, పొదల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనివల్ల విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, గౌరవానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులతో నీళ్లు మోయించడం, వంట పనులు చేయించడం, భోజనం వడ్డించడం వంటి పనులు చేయిస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వారితో ఇలాంటి పనులు చేయించడం సరికాదన్నారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు. వసతి గృహంలోని బాత్రూమ్లు, తలుపులు, భవనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యార్థుల వసతి తదితర మౌలిక సదుపాయాలను అధికారులు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అన్నారు. విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు నిజమని తేలితే వార్డెన్, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. విద్యార్థులకు తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరైన తలుపులు, మెరుగైన నివాస సదుపాయాలు వెంటనే కల్పించాలని శ్రీకాంత్ కోరారు. విద్యార్థుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని బుడ్డొల్ల శ్రీకాంత్ హెచ్చరించారు.


