ఎస్.కోట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
₹2.73 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో 210 తాగునీటి బోర్లు మంజూరు
విజయనగరం జిల్లా బ్యూరో/రమణ, సెప్టెంబర్16. పున్నమి ప్రతినిధి
ఎస్ కోట నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, మారుమూల గ్రామాలు సైతం తాగునీటి ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితకుమారి తెలిపారు. ఈ మేరకు ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధుల నుంచి రూ. 2.73 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 210 నూతన తాగునీటి బోర్లు తవ్వకానికి పరిపాలనా అనుమతులు లభించినట్లు ఆమె వెల్లడించారు.
తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆయా ప్రాంతాల్లో బోర్లు మంజూరు చేయాలని తాను జిల్లా కలెక్టర్కు లేఖ ద్వారా ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు డీఎంఎఫ్టీ చైర్మన్ శ్రీ ఎస్. రామ్సుందర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, ఆర్డర్ కాపీలను జారీ చేసినందుకు ఆయనకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో ఒక్కో బోరుకు రూ. 1.30 లక్షల అంచనా వ్యయంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా పనుల వివరాలను ఎమ్మెల్యే వెల్లడిస్తూ… ఎల్.కోట మండలంలో అత్యధికంగా 86 బోర్లు, ఎస్.కోట మండలంలో 42, వేపాడ మండలంలో 33, జామి మండలంలో 25, కొత్తవలస మండలంలో 24 బోర్లు తవ్వించేందుకు అనుమతులు వచ్చినట్లు స్పష్టం చేశారు. గ్రామాల్లోని బీసీ, ఎస్సీ కాలనీలు, రైతుల కల్లాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, శ్మశానవాటికలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇలా ప్రజల అవసరాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్థలాలను కేటాయించామని చెప్పారు.
ఈ పనులన్నింటినీ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం (RWS&S) ఆధ్వర్యంలో నిర్దేశిత నిబంధనల మేరకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు లలితకుమారి గారు తెలిపారు. పనులు ప్రారంభం కాకముందు, పనులు జరుగుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత జియో-ట్యాగింగ్తో ఫొటోలు తీసి రికార్డు చేయాలని, నాణ్యతా నియంత్రణ విభాగం ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ ఇంజనీర్లకు ఆమె స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే తమ ప్రాధాన్యతని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పునరుద్ఘాటించారు.

