ఖమ్మం నగరంలోని కాలవడ్డు, ప్రకాష్నగర్ వద్ద మున్నేరు వాగులో ప్రతి ఏటా నిర్వహించే గణపతి నిమజ్జనాలకు ఈసారి వర్షాభావ పరిస్థితులు ఆటంకంగా మారాయి. మున్నేరులో నీరు లేకపోవడంతో ప్రభుత్వం దంసలాపురం చెరువులో గణపతి విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు పనులను ముమ్మరం చేశారు. చెరువు వరకు ప్రత్యేక రహదారి నిర్మాణంతో పాటు భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో సులభంగా నీటిలోకి దింపేందుకు ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతం చేశారు.



