భూపాలపల్లి: బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహభరితంగా నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, విద్యార్థులు సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసి, పుష్పాలు, పత్రాలతో అలంకరించారు. గణపతి పూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, విద్యార్థులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. విద్యార్థులు వినాయక చవితి పండుగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించడం, సహజ రంగులు మరియు పూలతో పూజా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ, “పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, ఐక్యత, భక్తి, పర్యావరణ బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తాయి” అని తెలిపారు.
వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.


