వేంసూరు /ఖమ్మం
వేంసూరు: మండలంలోని కందుకూరు గ్రామంలో ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి పాలా నాగ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే విపత్తుల సమయంలో రైతులకు అండగా ఉండేదన్నారు. కౌలు రైతులు ఎకరాకు రూ.20 వేల ముందస్తు కౌలు, రూ.15 వేల పెట్టుబడి పెట్టి నష్టపోయారని తెలిపారు. సీనియర్ నాయకులు దొడ్డపనేని కృష్ణయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా వేంసూరు మండలానికి ఇప్పటివరకు నీరు అందలేదని, ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించాలని కోరారు. కార్యక్రమంలో గొర్ల ప్రభాకర్ రెడ్డి, మాదిరాజు శ్రీనివాసరావు, గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, కొప్పుల మధుసూదన్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, చల్లా అప్పిరెడ్డి, బండి ప్రభాకర్ రెడ్డి, తుమ్మూరు చంద్రమోహన్ రెడ్డి, ఖమ్మంపాటి వెంకటేశ్వరరావు, బండి చెన్నకేశవరెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



