మంథని ప్రాంతంలో చదరంగం ఆటకు జీవం పోసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు రామడుగు ప్రభాకర్ (90) గురువారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, క్రీడాభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదరంగంపై అపారమైన ఆసక్తి, పట్టుతో ఎందరో యువతకు ప్రభాకర్ స్ఫూర్తిగా నిలిచారు. మంథనిలో చదరంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పలువురిలో ఆటపై ఆసక్తిని పెంచారు. ఆయన ప్రావీణ్యాన్ని గుర్తించి ఆ కాలంలో పలువురు ప్రేమతో ‘గ్రాండ్ మాస్టర్’ అని పిలిచేవారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ అనంతరం ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లారు. మంథనిలోని హరే రామ హరే కృష్ణ ఆశ్రమం స్థాపకుడిగా కొనసాగుతూ ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నిరాడంబర జీవనశైలితో అందరితో ఆప్యాయంగా మెలిగారు. ప్రభాకర్కు భార్య రాధామణి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ మంచిర్యాల సాయిబాబా ఆలయంలో 35 సంవత్సరాలు పూజారిగా సేవలందించి, ప్రస్తుతం మంథనిలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో అర్చకులుగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు ఖతర్లో ఉద్యోగం చేస్తున్నారు. చదరంగ ప్రోత్సాహకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆధ్యాత్మిక సాధకుడిగా ప్రభాకర్ అందించిన సేవలు మంథని ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు. ఆయన మృతి మంథని ప్రాంతానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.


