నెల్లూరు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ విమర్శల పేరుతో కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
“దిగజారుడు వ్యాఖ్యలు చేసే ముందు మీ హద్దులు గుర్తుంచుకోండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చేసిన అక్రమాలు ఆధారాలతో బయటపడితే జైలుశిక్షతోపాటు ఆస్తుల జప్తు కూడా తప్పదని తెలుసుకోండి. బెదిరింపులు, అసత్య ఆరోపణలు, విషప్రచారంతో మమ్మల్ని భయపెట్టలేరు. మీరు ఎంతగా విమర్శిస్తే ప్రజల్లో మాకు అంత ఆదరణ పెరుగుతుంది. ఇదే ధోరణి కొనసాగిస్తే జీవితాంతం మాజీ నాయకులుగానే మిగిలిపోతారు” అని హెచ్చరించారు.
“మీ ఆర్థిక వ్యవహారాలు, పరస్పర బలహీనతలు ప్రజలకు తెలియవని భ్రమపడవద్దు. ఒకరి రహస్యాలు మరొకరి చేతిలో పెట్టుకొని రాజకీయ నాటకాలు ఆడటం మానండి. రూప్కుమార్ యాదవ్ను బెదిరించి వెనక్కి తగ్గించగలమని భావించడం మీ మూర్ఖత్వమే. ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము భయపడేది లేదు; వెనక్కి తగ్గేది అంతకంటే లేదు. వ్యక్తిగత దూషణలు ఆపకపోతే ప్రజాక్షేత్రంలోనే గట్టి సమాధానం చెబుతాం. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే స్పందిస్తాం. అయితే కుటుంబాల జోలికి వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు” అంటూ ప్రశాంతి రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.


