రైతులకు సబ్సిడీపై మినుముల పంపిణీ
మైలవరం, సెప్టెంబర్ 8: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సూచనల మేరకు మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతులకు సబ్సిడీపై మినుముల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయకుమార్ పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సబ్సిడీపై మినుముల విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు దొండపాటి విజయకుమార్ తెలిపారు. నాలుగు కేజీల మినుముల విత్తనాల ప్యాకెట్పై రూ.150 సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా పంటల సాగులో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ పంటలపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా సేంద్రియ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని, భూసారాన్ని కాపాడుకుంటూ స్థిరమైన దిగుబడులు సాధించే దిశగా సాగు పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. మినుముల సాగులో విత్తనశుద్ధి, నీటి యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పంట ప్రారంభం నుంచే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లు, ఇతర సమస్యలను కొంతవరకు నివారించడంతో పాటు నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని పేర్కొన్నారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, సబ్సిడీ తదితర ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కూటమి నాయకులు సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ సలహాలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తోట మాధవరావు, నాగులపాటి నాగబాబు, గద్దల సుబ్బారావు, బండారు వెంకటేశ్వరరావు, మాధవరావు, మట్టకొయ్య సుందరం,దొండపాటి పెద్ద కోటేశ్వరరావు, రైతులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



