*విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 82వ జయంతి వేడుకలు*
*”రాజీవ్ గాంధీ దూరదృష్టి భారత ప్రగతికి మార్గదర్శకం” – ప్రియాంక దండి*
భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎంవీపీ కాలనీలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రియాంక దండి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ యువ భారతంపై అపారమైన నమ్మకంతో దేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు.
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటరీకరణ, విద్య, యువతకు అవకాశాలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశాయని ప్రియాంక దండి పేర్కొన్నారు. నేటి డిజిటల్ భారతానికి ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలు అప్పటి కాలంలోనే విప్లవాత్మకమైనవని, దేశాన్ని 21వ శతాబ్దం వైపు తీసుకెళ్లాలన్న ఆయన ఆలోచన గొప్పదని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో, పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ మురారి, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, ఈగల మోహన్ సాయి, నాగేంద్ర, జగదీష్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


