హస్తకళాకారులకు అండగా వుడ్ బ్యాంక్.. ఏటికొప్పాకలో డిపో ప్రారంభం
ఎలమంచిలి, ఆగస్టు 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక హస్తకళాకారులకు వుడ్ కొరత లేకుండా అవసరమైన ముడి కలపను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వుడ్ బ్యాంక్ డిపోను ప్రారంభించారు. హస్తకళల తయారీకి అవసరమైన అంకుడు కర్ర కోసం కళాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేలా ఈ డిపోను ఏర్పాటు చేశారు.
ధవళేశ్వరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని ఆరు వుడ్ బ్యాంక్ డిపోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గొర్స సంతోష్ కుమార్, శంకర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమాన్ని ఏటికొప్పాకలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ స్థానిక అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలు, హస్తకళాకారుల సమక్షంలో డిపోను ప్రారంభించారు.
ఏటికొప్పాకలో సొసైటీ అధ్యక్షుడు పెదపాటి బాలాజీ రిబ్బన్ కట్ చేసి వుడ్ బ్యాంక్ను ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరణలో అన్నం బాబూజీ, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజారావు, శెన్నాంశెట్టి శ్రీను, దారా పోలిశెట్టి, వెంకీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వుడ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం: హస్తకళాకారులకు వుడ్ కొరత లేకుండా అటవీశాఖ అధికారులు పర్యవేక్షణలో అవసరమైన కలపను అర్హత కలిగిన కళాకారులకు సబ్సిడీ ధరపై అందించనున్నారు. దీంతో కలప కోసం కళాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గి, ఏటికొప్పాక సంప్రదాయ హస్తకళకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
ఈ కార్యక్రమంలో హస్తకళాకారులు, గ్రామ ప్రజలు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


