ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఆసుపత్రుల విభాగంలో అతిపెద్ద కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించినట్లు ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఆధునిక కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.
నెల్లూరు అపోలో హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ.కె. చక్రవర్తి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు సంయుక్తంగా నూతన డయాలసిస్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన సదుపాయాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన డయాలసిస్ సేవలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అతిపెద్ద డయాలసిస్ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. నెల్లూరు కేంద్రంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ప్రారంభించిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో 125 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు, వైద్య ప్రమాణాలను పాటిస్తూ అవయవ మార్పిడి చికిత్సలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స, డయాలసిస్, అవయవ మార్పిడి సేవల కోసం రోగులు ఇకపై ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెల్లూరులోనే సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, సామాజిక బాధ్యతతో అపోలో హాస్పిటల్ పనిచేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ మస్తాన్ వలీ, డాక్టర్ రాకేష్, యూరాలజీ వైద్యులు డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ రంగనాథన్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



