ఖమ్మం,
(పున్నమి న్యూస్:)
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ ముష్కాన్-12 విజయవంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 122 మంది చిన్నారులను రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో 110 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
బాల కార్మికులను గుర్తించి రక్షించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై 53 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు.
రక్షించిన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్లో నమోదు చేసి, వారిలో 103 మందిని వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించినట్లు సీపీ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసులు నిరంతరం చర్యలు కొనసాగిస్తారని, చిన్నారులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

