మేడిపల్లి నక్కర్త, యాచారం మండలం:
నక్కర్త–మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థుల కోసం స్టేజి నిర్మాణం చేపట్టనున్నట్లు BRR ఫౌండేషన్ అధ్యక్షులు బూడిద రాంరెడ్డి తెలిపారు.
ఇటీవల హైదరాబాద్లోని తమ కార్యాలయంలో నక్కర్త–మేడిపల్లి గ్రామానికి చెందిన ZPHS ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి పాఠశాల విద్యార్థుల కోసం శాశ్వత స్టేజి నిర్మించాలని విజ్ఞప్తి చేయగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో BRR ఫౌండేషన్ సభ్యులు గురువారం పాఠశాలను సందర్శించి స్టేజి నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు దేంది సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొని స్థల పరిశీలనలో భాగస్వాములయ్యారు.
స్థల పరిశీలన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా త్వరలోనే నాణ్యమైన స్టేజి నిర్మాణం చేపడతామని ఫౌండేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నక్కర్త–మేడిపల్లి గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తరఫున BRR ఫౌండేషన్ అధ్యక్షులు బూడిద రాంరెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని కొనియాడారు.






