ఖమ్మం, జూలై
ఖమ్మం జిల్లాలో PMEGP రుణాల మంజూరు, ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు మరియు ఆయా పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, PMEGP పథకం కింద దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై బినామీల పేర్లపై కోట్ల రూపాయల సబ్సిడీలు మంజూరు చేశారని పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగులు రుణాలకు దూరమవుతున్నారని అన్నారు.
అదేవిధంగా, ప్రీ-ప్రైమరీ నియామకాలలో మెరిట్కు విరుద్ధంగా ఇంటర్వ్యూ మార్కులు కేటాయించి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. జిల్లాలో భర్తీ చేసిన 114 పోస్టుల మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ మార్కులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. PMEGP రుణాలు, నియామకాలపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే జిల్లా కలెక్టర్ను కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



