*జనసంద్రమైన సింహాచలం.. వేడుకగా 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ*
ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం
అప్పన్న నామస్మరణతో కిటకిటలాడుతున్న 32 కి.మీ. మార్గం
10 లక్షల మందికి పైగా పాల్గొంటారని అధికారుల అంచనా
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు.. డ్రోన్లతో పోలీసుల పర్యవేక్షణ
స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, మంచినీటి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గం మార్మోగిపోతోంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో 32 కిలోమీటర్ల మార్గమంతా కిటకిటలాడుతోంది.
కొండ దిగువన ఉన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
పాదయాత్ర చేస్తున్న భక్తుల కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో 33 చోట్ల వైద్య శిబిరాలు, 26 అంబులెన్స్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వారికి అప్పన్న ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. మార్గమధ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
32 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుని భక్తులు బుధవారం ఉదయానికి స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
Uploaded Video:

