నెల్లూరు, జూలై 27: సీపీఐ సీనియర్ నాయకుడు, ప్రజానాయకుడు కామ్రేడ్ పముజుల దశరథ రామయ్య పార్థివదేహానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా సౌత్ మోపూరు గ్రామంలో సీపీఐ అగ్రనేత నారాయణతో పాటు పలువురు ప్రముఖులతో కలిసి మంత్రి ఆనం నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, దశరథ రామయ్య ప్రజాసేవ, పోరాట పటిమ, ప్రజా ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ప్రజాసేవనే పరమావధిగా భావించి జీవితాంతం పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడిగా ఆయనను కొనియాడారు.దశరథ రామయ్యతో నాలుగున్నర దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఆనం, “ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి” అన్నారు.దశరథ రామయ్య సతీమణితో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “రాజకీయంగా విభేదాలు ఉన్నా నన్ను ఎంతో ఆదరించి ఆశీర్వదించిన మహాత్మురాలు ఆమె. ఈ పరిస్థితిలో ఆమెను కూడా ఇలా చూడాల్సి వస్తుందని ఊహించలేదు” అని భావోద్వేగానికి గురయ్యారు.అనంతరం దశరథ రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.నాలుగు దశాబ్దాల పాటు సౌత్ మోపూరు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీగా విశిష్ట సేవలందించిన దశరథ రామయ్య నిబద్ధత, నిరాడంబరతతో ప్రజల మన్ననలు పొందారని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆయన మరణం నెల్లూరు జిల్లాకు తీరని లోటని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాళులర్పించారు.



