నీట్/సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలను ఖండిస్తూ క్యాండిల్ లైట్ మార్చ్, సత్యాగ్రహం విజయవంతం
– సయ్యద్ గౌస్ పీర్
కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి):
నీట్/సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలను ఖండిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కోటి రెడ్డి సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఐటీఐ సర్కిల్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా కడప నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ, నీట్/సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తు, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను పరిరక్షించేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, కార్యక్రమంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, పోలీసుల రూపంలో వచ్చిన దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొంటూ, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేసేందుకే ఈ క్యాండిల్ లైట్ మార్చ్, సత్యాగ్రహాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడప నగర కాంగ్రెస్ కమిటీ సభ్యులు, డివిజన్ ఇన్చార్జీలు, బూత్ స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, కేకేసీ తదితర అనుబంధ విభాగాల నాయకులు అంజన్ కుమార్, సౌదాగర్ సాదిక్, సిద్ధిక్, కరిముల్లా, సర్దార్ భాషా, మహబూబ్ బాషా, మురాద్, ఖాజా పీర్, షేక్ అన్వర్, నాసిర్ ఖాన్, ముతహర్, సుబ్రహ్మణ్యం, అమీదా ఖానం, జమీల్, ఆరిఫ్ తదితరులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


